Minister Uttam Kumar Reddy: తెలంగాణలో రికార్డు స్థాయి వరి కొనుగోళ్లు జరుగుతున్న నేపథ్యంలో ఆహార ధాన్యాల నిల్వ సామర్థ్యం పెంపు, కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) వ్యవస్థలో పారదర్శకత, డిఫాల్ట్ రైస్ మిల్లర్లపై కఠిన చర్యలపై పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సోమవారం కీలక చర్చలు, సమీక్షలు నిర్వహించారు.

భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) జనరల్‌ మేనేజర్‌ అనుజ్‌ త్యాగి, అధికారులు మంత్రిని సచివాలయంలోని ఆయన కార్యాలయంలో కలిశారు. ధాన్యం కొనుగోలు, నిల్వ సదుపాయాలు, రవాణా అంశాలపై చర్చించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కేంద్ర పూల్‌కు అందుబాటులో ఉన్న నిల్వ సామర్థ్యం 31 లక్షల టన్నులు మాత్రమేనని, ఎఫ్‌సీఐ ప్రమాణాల ప్రకారం ఇంకా 16.25 లక్షల టన్నుల నిల్వ లోటు ఉన్నందున అదనపు గిడ్డంగుల నిర్మాణం అత్యవసరమని అధికారులు వివరించారు. ఈ మేరకు మంత్రి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

ఇదే సమయంలో సీఎంఆర్ వ్యవస్థపై మంత్రి విస్తృత సమీక్ష చేపట్టారు. గత 10-12 ఏళ్లుగా జరిగిన వ్యవహారాలపై లోతుగా పరిశీలన జరిగింది. సీఎంఆర్‌లో పారదర్శకత, సాంకేతిక సంస్కరణలపై చర్చించారు. ప్రభుత్వానికి బకాయిలు చెల్లించని డిఫాల్ట్ రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. బకాయిల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటివరకు జరిగిన విజిలెన్స్ దాడులు, నమోదైన కేసులు, దర్యాప్తు పురోగతిపై సమగ్రంగా చర్చించారు. జిల్లాల వారీగా రైస్ మిల్లర్ల పనితీరు, బకాయిల పరిస్థితి, డిఫాల్ట్‌ల వివరాలపై అధికారులు నివేదికలు సమర్పించారు.

ప్రభుత్వ ఆస్తుల రక్షణకు కొత్త వ్యూహాలు రూపొందించాలని నిర్ణయించారు. పౌరసరఫరాల శాఖ, విజిలెన్స్, లీగల్ విభాగాల ఉన్నతాధికారులకు సంబంధిత ఆదేశాలు జారీ అయ్యాయి. రైతుల ప్రయోజనాలు, ప్రభుత్వ నిధుల రక్షణే ఈ చర్యల ప్రధాన లక్ష్యమని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story