కివీస్ సిరీస్‌పై బీసీసీఐ నజర్

Shami’s Re-Entry into Team India: ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 ఫైనల్ తర్వాత టీమిండియాకు దూరమైన స్పీడ్‌స్టర్ మహ్మద్ షమీ, మళ్లీ నీలి రంగు జెర్సీ ధరించడానికి సిద్ధమవుతున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేస్తూ సెలక్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్న షమీని, జనవరి 11 నుంచి ప్రారంభం కానున్న న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు ఎంపిక చేసే ఆలోచనలో బీసీసీఐ ఉంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బెంగాల్ తరఫున ఆడి 7 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు పడగొట్టిన షమీ, ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీలోనూ 3 మ్యాచ్‌ల్లో 6 వికెట్లు తీసి తన ఫామ్‌ను నిరూపించుకున్నాడు.

న్యూజిలాండ్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌లో స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అనుభవజ్ఞుడైన షమీని జట్టులోకి తీసుకోవాలని సెలక్టర్లు భావిస్తున్నారు. షమీ బౌలింగ్ నైపుణ్యంపై ఎవరికీ సందేహాలు లేవు, కానీ అతడి ఫిట్‌నెస్ మాత్రమే సెలక్టర్లకు ప్రధాన అంశంగా మారింది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. షమీ ఫిట్‌నెస్‌ సాధిస్తే 2027 వన్డే ప్రపంచకప్‌లో కూడా అతను ఆడే అవకాశాలను కొట్టిపారేయలేమని బీసీసీఐ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story