New Chapter in India–Israel Ties: భారత్-ఇజ్రాయెల్ సంబంధాల్లో కొత్త అధ్యాయం: 'ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం' స్థాయికి ఎదిగిన ద్వైపాక్షిక బంధం
ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం' స్థాయికి ఎదిగిన ద్వైపాక్షిక బంధం

New Chapter in India–Israel Ties: భారత్, ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు కొత్త శకాన్ని ప్రారంభించాయి. దీర్ఘకాలంగా పరీక్షలకు నిలిచిన ఈ బంధాన్ని ఇరు దేశాలు 'ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం' (Special Strategic Partnership) స్థాయికి ఉన్నతీకరించాయి. ఇద్దరూ ఉభయ ప్రయోజనకర స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) త్వరలోనే కుదుర్చుకోవాలని నిర్ణయించుకున్నారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో గురువారం భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు విస్తృత చర్చలు జరిగాయి. అమెరికా-ఇరాన్ ప్రతిష్టంభన వంటి అంతర్జాతీయ అంశాలు కూడా చర్చల్లో స్థానం పొందాయి.
భేటీ అనంతరం ఇరు దేశాలు వాణిజ్యం, వ్యవసాయం, విద్య, ఇంధనం, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ చెల్లింపులు తదితర రంగాల్లో మొత్తం 17 ముఖ్యమైన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. సాంకేతికత బదిలీ ఫ్రేమ్వర్క్ ద్వారా సైనిక హార్డ్వేర్ సంయుక్త అభివృద్ధి, ఉత్పత్తి చేపట్టడం ద్వారా ఇప్పటికే ఉన్న రక్షణ భాగస్వామ్యాన్ని మరింత విస్తరించాలని నిర్ణయించారు.
భవిష్యత్ సాంకేతికతల్లో సహకారం
కృత్రిమ మేధస్సు (AI), క్వాంటమ్ కంప్యూటింగ్, కీలక ఖనిజాల రంగాల్లో సహకారాన్ని పెంచుకోవడానికి భారత్-ఇజ్రాయెల్ కీలక భవిష్యత్ సాంకేతికతల భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ఇజ్రాయెల్లో UPI వినియోగానికి ఒప్పందం కుదిరిందని తెలిపారు. పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వం భారత భద్రతా ప్రయోజనాలతో నేరుగా ముడిపడి ఉన్నాయని, గాజా శాంతి ప్రణాళికకు మద్దతు తెలిపారు. ఉగ్రవాదానికి ప్రపంచంలో చోటు లేదని స్పష్టం చేశారు. ఇరు ప్రధానుల చర్చల అనంతరం ఉమ్మడి ప్రకటన కూడా విడుదల చేశారు.
ఇన్నొవేషన్ ఎగ్జిబిషన్ సందర్శన
జెరూసలెంలో ఏర్పాటు చేసిన ఇన్నొవేషన్ ఎగ్జిబిషన్ను మోదీ సందర్శించారు. AI, ఆరోగ్య సేవలు, వ్యవసాయ రంగాల్లో వినూత్న ఆవిష్కరణలను చూసి ముగ్ధులయ్యారు. భారత్లో పెట్టుబడులు పెట్టాలని ఇజ్రాయెలీ టెక్ కంపెనీలకు పిలుపునిచ్చారు.
ఇజ్రాయెల్ అధ్యక్షుడితో సమావేశం
ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఇసాక్ హెర్జోగ్తో మోదీ భేటీ అయ్యారు. విద్య, స్టార్టప్లు, నవీకరణలు, సాంకేతికతలు, అనుసంధానం వంటి రంగాల్లో సహకారాన్ని మరింత పెంచుకోవడంపై చర్చించారు. ద్వైపాక్షిక మైత్రికి చిహ్నంగా ఓక్ చెట్టును నాటారు. భారత్కు పర్యటనకు హెర్జోగ్ను మోదీ ఆహ్వానించారు.
ఇతర విశేషాలు
భారత సంతతికి చెందిన యూదు ప్రముఖులు మోదీతో సమావేశమయ్యారు. ఇజ్రాయెల్లో భారత సంతతి యూదుల సంఖ్య దాదాపు 85 వేలు.
ఇజ్రాయెలీ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ ‘ఫౌదా’ తారాగణంతో మోదీ ముచ్చటించారు. సెల్ఫీని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.
యాద్ వశెమ్ (హాలోకాస్ట్ స్మారక కేంద్రం) వద్ద నివాళులర్పించారు. నెతన్యాహుతో కలిసి సందర్శించారు.
ఇజ్రాయెల్ పర్యటన ముగించుకుని మోదీ స్వదేశానికి తిరిగి వచ్చారు.

